by సూర్య | Fri, Jan 14, 2022, 06:52 PM
క్రికెట్(రాజకీయ) ఆట ఎలా ఆడాలో ఈ సీఎంకు ఏ మాత్రం తెలియదని యూపీ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగిని ఉద్దేశించి సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేస్ యాదవ్ అన్నారు. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఏమాత్రం మింగుడుపడని పరిణామాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలోకి క్యూ కడుతున్నారు. రోజూ ఎవరో ఒక మంత్రి రాజీనామా చేయడం, ఆయన వెంట ఒకరిద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ గూటికి చేరడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీ వికెట్లు టపటపా పడుతున్నాయని ఎద్దేవా చేశారు. క్రికెట్ ఆట ఎలా ఆడాలో ఈ సీఎంకు తెలియడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. మూడ్రోజుల వ్యవధిలో ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేయడం పట్ల ఆయన పైవిధంగా స్పందించారు. తాజాగా ఇతర పార్టీల నేతలు కూడా సమాజ్ వాదీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అప్నాదళ్ పార్టీ ఎమ్మెల్యే అమర్ సింగ్ చౌదరి, బీఎస్పీ శాసనసభ్యులు బలరామ్ సైనీ, నీరజ్ కుమార్ కుష్వాహా కూడా సమాజ్ వాదీ గూటికి చేరారు.
Latest News