by సూర్య | Thu, Jan 13, 2022, 09:51 PM
ఈ సారి ఎన్నికలు పెనుసవాలుగా మారిన నేపథ్యంలో బిజెపి అగ్రనాయకత్వం ఉత్తరప్రదేశ్ ఎన్నికల అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం గురువారం నాడుబీ జేపీ కేంద్ర ఎన్నికల కమిటీ దీని కోసం సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ వర్చ్యువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలి మూడు విడతల్లో పోటీ చేసేందుకు సుమారు 170 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా అభ్యర్థుల ఖరారు, మిత్రపక్షాలకు కేటాయించే సీట్లపై కసరత్తు చేశారు హోం మంత్రి అమిత్ షా. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు పార్టీకి చెందిన ముఖ్యులు, అప్నాదళ్ పార్టీ నేత అనుప్రియ పటేల్, ఇతర నేతలతో మంతనాలు జరిపారు.తొలి రెండు విడతలకు సంబంధించిన అభ్యర్ధులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండటంతో అక్కడి అభ్యర్ధులను తదుపరి సమావేశాల్లో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. అఖిలేష్ యాదవ్ తో ప్రధానంగా పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ.. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేపట్టింది. అయిదు రాష్ట్రాల్లో..అందునా ఉత్తరప్రదేశ్ లో తిరిగి అధికారం దక్కించుకోవటం పైనే బీజేపీ అగ్రనాయకత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Latest News