by సూర్య | Thu, Jan 13, 2022, 12:50 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు చోరీలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ విజయ్భాస్కర్ వివరాలు వెల్లడించారు. ఈనెల 7న ఫిరంగిపురంలోని సొలస బస్టాండ్ వద్ద గుంటూరుకు చెందిన ఏసీ మెకానిక్ పాలెం తిరుపతిరావు ద్విచక్ర వాహనం మాయమైంది. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం సొలస బస్టాండ్ వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న గుంటూరు రామిరెడ్డితోటకు చెందిన యువకుడు చింతల దుర్గాప్రసాద్ను పోలీసులు అదుపులో తీసుకొని విచారించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 దొంగతనాలు చేసినట్లు దుర్గాప్రసాద్ ఒప్పుకున్నాడు. గుంటూరులోని లాలాపేటలో ఒక టీవి, పెదకాకానిలో ఒక కంప్యూటర్, ఒక ద్విచక్రవాహనం, ఇంట్లో వస్తువులు, నరసరావుపేట, ఫిరంగిపురంలో రెండు ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ద్విచక్ర వాహనం, రెండు ఆటోలు మాయం చేశాడు. మొత్తం రూ. 6 లక్షల విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఫిరంగిపురం ఎస్సై అజయ్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Latest News