by సూర్య | Thu, Jan 13, 2022, 11:41 AM
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో 23-30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. భారత్ లో కూడా పిల్లల్లో కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒకటి రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపు నొప్పి రావడంతో పాటు వాంతులు అవుతున్నాయి. జ్వరం, ఇతర సమస్యలు ఎక్కువగా కనిపించడం లేదు. చాలామంది తల్లిదండ్రులు కడుపునొప్పిని అజీర్ణ సమస్యగా భావిస్తున్నారు. పరీక్షలు చేస్తే కరోనా సోకినట్లు నిర్ధారణ అవుతోంది. డెల్టా వేరియంట్ లో పిల్లల్లో కడుపు నొప్పి కనిపించేది కాదని, అప్పట్లో వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు చిన్నారులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి, 101-102 డిగ్రీల జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఐదేళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Latest News