by సూర్య | Tue, Jan 11, 2022, 12:01 PM
మన ఆటగాళ్లు కీలకమైన సమయాల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ లో ఈరోజు అత్యంత కీలకమైన మూడో టెస్టు ప్రారంభం కాబోతోంది. టెస్ట్ సిరీస్ ఎవరికి దక్కుతుందనే ఫలితాన్ని ఈ టెస్టు నిర్ణయించబోతోంది. మరోవైపు కెప్టెన్ కోహ్లీ ఈ టెస్టులో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ, మిడిల్ ఆర్డర్ లో కావాలని మార్పులు చేయడం ఉండదని, ఒక సాధారణ ప్రక్రియగానే మార్పులు ఉంటాయని చెప్పారు. మన ఆటగాళ్లు కీలకమైన సమయాల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారని ప్రశంసించాడు. జట్టులో ఏదైనా మార్పు చోటుచేసుకుందంటే... ఆ మార్పు ఎందుకు జరిగిందనే విషయం ఆటగాళ్లందరికీ తెలుసని చెప్పాడు. ఇక తన ఫామ్ గురించి చర్చ జరగడం ఇదే తొలిసారి కాదని కోహ్లీ అన్నాడు. తన కెరీర్ లో ఎన్నోసార్లు తన ఫామ్ గురించి చర్చ జరిగిందని చెప్పాడు. 2014 ఇంగ్లండ్ టూర్ అందులో ఒకటని అన్నాడు. తన గురించి తాను ఆలోచించనని... ఇతరులే తన ఆటను గమనిస్తుంటారని చెప్పాడు. తన ఆటను తాను ఎవరితో పోల్చుకోనని... తనతో తానే పోల్చుకుంటానని తెలిపాడు. జట్టు విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయడమే తన లక్ష్యమని... అందుకే ఇన్నేళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పాడు. తనను తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. దేశం కోసం తాను ఎంత ఆడానో అందరికీ తెలుసని చెప్పాడు.
Latest News