by సూర్య | Tue, Jan 11, 2022, 12:02 PM
తెలుగు సినిమాకు ఉత్తరాధి రాష్ట్రాల్లో కంటే సొంత రాష్ట్రం ఏపీలో టిక్కెట్ ధర తక్కువగా ఉండటంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో ఆర్జీవీ ఈ వివాదంపై మరోసారి ట్వీట్ చేశారు. 'దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధర రూ.2,200కి విక్రయించడానికి మహారాష్ట్రలో అనుమతి ఇచ్చారు. కానీ, రాజమౌళి సొంత రాష్ట్రం ఏపీలో మాత్రం టికెట్లను రూ.200కి విక్రయించడానికి కూడా అనుమతి లేదు. ఇది కట్టప్పను ఎవరు చంపారు? అనే ప్రశ్నలా ఉంది' అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఐనాక్స్ మల్టీప్లెక్స్ లలో టికెట్లను రూ.2,200కి విక్రయిస్తున్నారని ఆయన చెప్పారు. ఇదిలావుంటే ఏపీలో టికెట్ల ధరలపై ఇటీవల ఆర్జీవీ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన అడిగిన ప్రశ్నలకు ఏపీ మంత్రి పేర్ని నాని కూడా సమాధానం ఇచ్చి, టికెట్ల ధరల తగ్గింపుపై నేరుగా చర్చించినప్పటికీ వివాదం ముగియకపోవడం గమనార్హం.
Latest News