by సూర్య | Mon, Jan 10, 2022, 08:29 PM
గజేంద్రులకు కోపం వస్తే...జరిగే నష్టాన్ని వారించలేం. తాజా ఘటనలతో ఒడిశా వాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఒడిశాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఏనుగుల దాడులతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సందర్భంలో మయూర్భంజ్ జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేసింది. ముందుగా బాలాసోర్ నుంచి రాస్గోవింద్పుర్కు వెళ్తున్న బస్సును అడ్డగించింది. ఆ తర్వాత బస్సును తొండంతో కొద్ది దూరం వరకూ తోసింది. దాంతో డ్రైవర్ స్పీడ్ పెంచి అక్కడ నుంచి బస్సును తీసుకెళ్లిపోయాడు. ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ టైంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏనుగు దాడితో ప్రయాణికులు గట్టిగా అరుపులు, కేకలు వేస్తూ భయపడిపోయారు. ఈ ఘటనలో బస్సు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏనుగు బస్సును వెనుక నుంచి నెడుతుండగా స్థానికులు వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదిలావుంటే అదే జిల్లాలో శనివారం రసగోబిందాపూర్ పరిధిలోని జమాసులా అడవిలోని పాడుబడిన బావిలో ఏనుగు పిల్ల పడిపోయింది. బావి కేవలం 5 అడుగులు లోతులోనే ఉండడంతో ఏనుగుకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి దానిని రక్షించారు. ఆ సమయంలోనే ఓ ఏనుగుల గుంపు అక్కడ ఉన్న గ్రామస్థులు, అటవీ శాఖ అధికారులపై దాడి చేసింది. ఆ ఏనుగుల దాడిలో సుమారు నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
Latest News