by సూర్య | Tue, Oct 26, 2021, 03:13 PM
రోడ్డు ప్రమాదాలు కూడా దేశ సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తాజాగా ఓ పరిశోధన వెల్లడించింది. వాహన ప్రమాదాల కారణంగా.. భారత్లో రూ. 1.17 లక్షల కోట్ల నుంచి రూ. 2.91 లక్షల కోట్ల వరకు సామాజిక ఆర్థిక భారం పడుతోందని ఈ పరిశోధనలో తేల్చింది. అంటే దేశ జిడిపిలో ఇది 0.55 నుంచి 1.35 శాతం వరకు ఉంటుందని అంచనా. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంత ఆర్థిక భారం పడనుందనే దానిపై 'బాష్ ఇండియా అడ్వాన్స్డ్ అటానమస్ సేఫ్టీ సిస్టమ్స్ అండ్ కార్పొరేట్ రీసెర్చ్' సంస్థ అధ్యయనం నిర్వహించింది.
ఈ సంస్థ గత రెండు దశాబ్దాల్లో జరిగిన వాహన ప్రమాదాల డేటా ఆధారంగానే ఈ అధ్యయనం నిర్వహించినట్లు పేర్కొంది. ఈ అధ్యయనం ద్వారా.. నూతన ఉత్పత్తులను గుర్తించడానికి, వ్యాపార వ్యూహాలు రూపొందించడానికి, భద్రతా ప్రమాణాలు పాటించడానికి ఉపయోగపడుతుందని ఆ సంస్థ తెలిపింది. 'రోడ్డు ప్రమాదాల వల్ల సామాజిక, ఆర్థిక, వైద్యపరమైన ఖర్చులు చాలామందిని ఇబ్బందికి గురిచేస్తాయి. వీటిని తగ్గించడం చాలా కీలకం. అయితే ఇందుకు సంబంధించిన డేటా సరిగ్గా లేదు. అందుకే ఈ అధ్యయనం చేశాం' అని ఈ పరిశోధనలో పాల్గొన్న బాష్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ గిరికుమార్ తెలిపారు.
Latest News