by సూర్య | Tue, Oct 26, 2021, 08:48 AM
వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవాపథకం ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను మంగళవారం సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రైతులకు వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లను ప్రభుత్వం జమచేసింది. తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద 2019 నుంచి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీనిలో రూ.7500 మే నెలలో, రూ.4 వేలు అక్టోబర్లో, మిగిలిన రూ.2 వేలు జనవరిలో జమ చేస్తున్నారు. అంతేకాకుండా ఖరీఫ్-2020 సీజన్ కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు రూ.112.70 కోట్ల సున్నావడ్డీ రాయితీ సొమ్మును నేడు సీఎం జగన్ వారి ఖాతాల్లో జమచేయనున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వాటికి సంబంధించి సబ్సిడీ సొమ్ము రూ.25.55 కోట్లను కూడా నేడు రైతు గ్రూపులకు జమచేయనుంది.
Latest News