by సూర్య | Sun, Oct 24, 2021, 10:59 AM
ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్థాన్పై భారత్కు ఎంత మంచి రికార్డున్నా.. బలాబలాల్లోనూ టీమ్ఇండియాదే పైచేయిగా కనిపిస్తున్నా.. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే కోహ్లీసేనకు కష్టమనే చెప్పాలి. ఎందుకంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇలాగే అంచనా వేసిన భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అప్పుడు ఫైనల్లో పాక్ బ్యాట్స్మన్ ఫకర్ జమాన్ సంచలన సెంచరీతో టీమ్ఇండియాకు విజయాన్ని దూరం చేసిన సంగతి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా మరోసారి కోహ్లీసేనపై అతడు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు ఇటీవల అతడి ఫామ్ సైతం గొప్పగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా అతడికి కెప్టెన్ బాబర్ అజామ్ తోడైతే భారత్కు ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. అలాగే బాబర్ సైతం అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో అతడిని ఎంత త్వరగా పెవిలియన్కు పంపిస్తే టీమ్ఇండియాకు అంత మంచిది. అతడు కుదురుకుంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక చివరగా ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పేరున్న మరో ఓపెనర్ రిజ్వాన్ గురించి చెప్పుకోవాలి. అతడు 2021లో మొత్తం 33 మ్యాచ్లు ఆడి 1462 పరుగులు చేశాడు. దీంతో రిజ్వాన్ సైతం టీమ్ఇండియాకు సవాలు విసిరే అవకాశం ఉంది. ఈ ముగ్గుర్నీ భారత బౌలర్లు త్వరగా పెవిలియన్ పంపడంపైనే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.
వీళ్లు కూడా ప్రమాదమే..
మరోవైపు పాకిస్థాన్ జట్టులో వయసు పెరుగుతున్నా సత్తా తగ్గని ఆటగాళ్లు.. షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్. వీరిద్దరితోనూ టీమ్ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్లో దాయాది జట్టు ఎప్పుడూ బలమైన జట్టే. గత రెండేళ్లలో ప్రపంచ స్థాయి పేసర్గా ఎదిగిన షహీన్ షా అఫ్రిదితో భారత బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడాలి. అలాగే హసన్ అలీ, హారిస్ రవూఫ్ లాంటి ప్రతిభావంతులైన పేసర్లు సైతం కోహ్లీసేనకు సవాలు విసిరే అవకాశం లేకపోలేదు. షహీన్ను ఓపెనర్లు రోహిత్, రాహుల్ ఎలా ఎదుర్కొంటారనేది కీలకంకానుంది. అయితే, లోపలికి వచ్చే బంతులను ఆడడంలో టీమ్ఇండియా ఆటగాళ్ల బలహీనతను ఈ పాక్ పేసర్ సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. అతడి ఆటలు సాగనివ్వకుండా ఆడితే మరీ మంచిది. ఇక స్పిన్నర్లు ఇమాద్, షాదాబ్లు ఫామ్లో ఉన్నా మన బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడితే వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించొచ్చు.
Latest News