by సూర్య | Sat, Oct 23, 2021, 07:00 PM
కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా భూమా అఖిలప్రియ గురించి మాట్లాడుకుంటున్నారు . అఖిల ప్రియ టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరబోతుందని జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి కుటుంబానికి భూమా కుటుంబానికి మధ్య మొదటినుంచి రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా శోభానాగిరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కనుమరుగవడం భూమా కుటుంబం వైసీపీలో చేరడం ఆ తర్వాత టీడీపీలోకి రావడం జరిగిపోయాయి. ఈ క్రమంలో శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తర్వాత భూమనాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు.
చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా భూమా కుటుంబం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. దీనికితోడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో జనసేనలో చేరితే సులభంగా గెలవచ్చు అని భూమా కుటుంబం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. భూమా అఖిల ప్రియ జనసేనలో చేరబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతోన్నాయి. ప్రస్తుతం అఖిల ప్రియ గర్భవతిగా ఉండటంతో ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రాజకీయంలో యాక్టివ్గా ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై భూమా అఖిలప్రియ స్పందించారు.
అదే సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్లో… తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తను జనసేనలో చేరడం లేదని టీడీపీలోనే కొనసాగుతానని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు
Latest News