by సూర్య | Fri, Oct 22, 2021, 07:36 PM
ఓ వైపు మామ వేధింపులు, మరోవైపు భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో చోటుచేసుకుంది. ఉరులి కాంచన్ ప్రాంతానికి చెందిన షీతల్ (28), విపుల్కు 2014లో వివాహమైంది. వారికి ఒక బాబు పుట్టాడు. కొన్ని నెలలకు విపుల్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. అత్తింట్లో షీతల్ కు వేధింపులు ఎక్కువయ్యాయి. విపుల్ తండ్రి కోడలు అని కూడా చూడకుండా షీతల్ తో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పగా విపుల్ పట్టించుకోలేదు. మరో మహిళతో విపుల్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని షీతల్ కు తెలిసింది. భర్త అలా చేయడం, మామ వేధించడంతో షీతల్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. షీతల్ తండ్రి తన కూతురి చావుకు ఆమె మామ, భర్త, అత్త కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షీతల్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. షీతల్ అత్తమామలపై, ఆమె భర్తపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Latest News