by సూర్య | Sat, Jun 12, 2021, 02:15 PM
అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను చైనా ఉల్లంఘిస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్థ " డబ్ల్యూటీఓ" కు జపాన్ ఫిర్యాదు చేసింది. తమ స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీలు భారీగా విధిస్తోందని తెలిపింది. 29 శాతం వరకు యాంటీ డంపింగ్ డ్యూటీలు విధించడం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించడమేనని వివరించింది.
2019 జూలై నుంచి స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతులపై చైనా యాంటీ డింపింగ్ డ్యూటీలను భారీగా విధిస్తోందని, దీనిపై చైనాతో సంప్రదింపులు జరపాలని డబ్ల్యూటీఓను జపాన్ శుక్రవారం కోరింది. జపాన్, కొరియా, ఇండోనేషియా, యూరోపియన్ యూనియన్ల నుంచి దిగుమతి చేసుకునే స్టెయిన్లెస్ స్టీల్పై చైనా 2019 జూలై నుంచి యాంటీ డంపింగ్ డ్యూటీలను విధిస్తోంది. ఇటువంటి ఉత్పత్తుల దిగుమతి వల్ల తమ దేశంలోని పరిశ్రమలు దెబ్బతింటున్నాయని చైనా చెప్తోంది. చైనా చేపడుతున్న యాంటీ డంపింగ్ చర్యలు 'టారిఫ్స్, ట్రేడ్లపై సాధారణ ఒప్పందం' " జీఏటీటీ" కి అనుగుణంగా లేవని, ఈ ఒప్పందంలోని అధికరణ 6ను అమలు చేయడంపై అంగీకారానికి విరుద్ధంగా ఉన్నాయని జపాన్ ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి కారణం చైనా అధికారుల నిర్ణయాలు, దర్యాప్తు విధానాల్లో లోపాలు ఉండటమేనని తెలిపింది. ఈ చర్యలను మానుకోవాలని చైనాను జపాన్ చాలాసార్లు కోరింది. కానీ ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.
Latest News