by సూర్య | Sat, Jun 12, 2021, 10:09 AM
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈనెల 17వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా హస్తినకు పయనమవుతుండడంతో ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ పర్యటన తొలిరోజే ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కరోనా రెండవ దశ వ్యాప్తి, ప్రభుత్వం చేపట్టిన నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ వ్యాప్తి, రాష్ట్రానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్లు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు అందించే అత్యవసర మందులను ఈ సందర్భంగా స్టాలిన్ ప్రధానిని కోరనున్నారు. అలాగే, 'నీట్' పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులను విడుదల చేయాలని ఆయన కోరనున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతోనూ స్టాలిన్ భేటీ కానున్నారు.
Latest News