by సూర్య | Thu, Jun 10, 2021, 11:18 AM
కోవిడ్ నాటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గడ్డంతో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన గడ్డంపై కొందరు వ్యంగంగా మాట్లాడుతుంటే.. మరికొందరు నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్తో పోల్చుతున్నారు. అయితే.. మోదీ గడ్డంను చూసిన మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి.. షేవ్ చేసుకోండంటూ రూ.100 మనియార్డర్ చేశాడు. మహారాష్ట్ర పూణే సమీపంలోని బారామతికి చెందిన చాయ్వాలా అనిల్ మోరే మోదీజీ గడ్డం తీసుకోవాలంటూ రూ.100 మనియార్డర్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు ఆయన ఓ లేఖను సైతం రాశాడు. మోదీజీ.. పెంచాల్సింది గడ్డం కాదు.. ఉపాధి పెంచండి, టీకాలు పెంచండి, కోవిడ్తో మరణించిన కుటుంబాలకు పరిహారం పెంచండి.. అంటూ పలు విజ్ఞప్తులు చేశాడు అనిల్ మోరే.
అనిల్ మోరే బారామతి ఇంద్రాపూర్ రోడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద టీ స్టాల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మోదీకి లేఖ రాశాడు. దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతోంది. దేశంలో ప్రజలు చనిపోతున్నారు. ఎందరివో ఉద్యోగాలు పోతున్నాయి. కానీ ప్రధాని మోదీ మాత్రం తన గడ్డాన్ని పెంచుకుంటున్నారు. ఆయన ఇంకా ఏమైనా పెంచాలనుకుంటే.. ప్రజలకు ఉపాధి పెంచాలి, టీకాలను పెంచాలి. వైద్య సౌకర్యాలు పెంచాలి.. నా సంపాదన నుంచి రూ.100 మోదీజీకి పంపుతున్నాను. ఈ మొత్తాన్ని గడ్డం తీయడానికి వాడితే సంతోషిస్తాను. మోదీజీ గొప్ప నాయకుడు. ఆయన్ను గౌరవిస్తాను.. ఆయనంటే అభిమానం కూడా.. ఆయనను బాధించాలని ఇలా చేయడం లేదు. కరోనా కారణంగా పెరుగుతున్న సమస్యలపై దృష్టి సారించి ఉపాధి పెంచితే దేశం బాగుపడుతుందనుకుంటున్నా అంటూ అనిల్ మోరే విజ్ఞప్తి చేశారు.
Latest News