by సూర్య | Sun, May 30, 2021, 10:50 AM
అనాథ బాలలకు, కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. వారి పేరిట ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. దానిపై వడ్డీని నెలనెలా వారికి 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు అందేలా చూస్తామన్నారు. దీంతోపాటు, గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు వారి చదువుకయ్యే అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇటువంటి చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఏ దిక్కూలేని బాలలకు ప్రభుత్వ వసతి గృహాలు, ఇతర సంస్థల్లో ఆశ్రయం కల్పించనున్నట్లు వెల్లడించారు. తల్లి లేదా తండ్రిని కోల్పోయిన చిన్నారులకు కూడా రూ.3 లక్షలు తక్షణ సాయంగా అందజేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. బంధువులు లేదా సంరక్షకుల వద్ద పెరిగే చిన్నారులకు నెలకు రూ.3 వేలను 18 ఏళ్లు వచ్చేదాకా అందజేస్తామన్నారు.
Latest News