by సూర్య | Mon, Apr 12, 2021, 07:47 AM
ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. ఎండలు పెరిగి అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు రాష్ట్రంపై విస్తరిస్తున్నాయి. ఈ తేమ గాలులు క్రమంగా దిగువకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలోని కర్నూలులో వర్షాలు ప్రారంభమై క్రమంగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తాయని, కోస్తాంధ్రలోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 22 వరకు వర్షాలు పడే సూచనలున్నాయని, దీని వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వెల్లడించారు. నేడు, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది.
Latest News