by సూర్య | Sat, Apr 10, 2021, 10:56 AM
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా, రోజు రోజుకు ట్రెండ్ మారుతున్నా అనాధిగా వస్తున్న కొన్ని ఆచారాలు మాత్రం ఏమాత్రం మారడం లేదు. కొన్ని మూఢనమ్మకాలను జనం ఇంకా పాటిస్తూనే ఉన్నారు. కొన్ని రకాల తెగల్లోనూ, గిరిజనుల్లోనూ కొన్ని వింత వింత ఆచారాలు ఇంకా పాటిస్తూనే ఉన్నారు. మహారాష్ట్రలోని కంచర్భట్ తెగకు చెందిన వారిలోనూ ఇలాంటి వివాదాస్పద ఆచారమే ఒకటి ఉంది. ఆ ఆచారమే ఇప్పుడు ఇద్దరు యువతుల కాపురాల్లో నిప్పులు పోస్తోంది. పెళ్లయిన మరుసటి రోజు నుంచే వారిద్దరినీ అవమానాల పాలు చేసింది. చిత్రహింసలకు కారణమయింది. చివరకు విడాకులు ఇస్తామంటూ భర్తలు బెదిరిస్తున్నా ఏం చేయలేక చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. తమకు జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రిలోని కొల్లాపూర్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు గతేడాది నవంబర్ 27న అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లతో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన రెండు కుటుంబాలు కంచర్భట్ తెగకు చెందిన వాళ్లు. ఈ తెగలో ఓ వివాదాస్పద ఆచారాన్ని ఇంకా పాటిస్తూనే ఉన్నారు. పెళ్లయిన మరుసటి రోజు శోభనం గదిలో నవ వధువుకు కన్యత్వ పరీక్షలను నిర్వహించడాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. మంచంపై తెల్లటి దుప్పటి పరిచి భర్తతో తొలిరోయి శృంగారాన్ని చేయాల్సి ఉంటుంది. తొలిరేయి శృంగారం తర్వాత స్త్రీ మర్మాంగాల నుంచి రక్తం కారితే వాళ్లు అప్పటి వరకు కన్యగా ఉన్నారని అర్థం. లేదంటే వాళ్లను కన్యగా భావించరు.
కొత్తగా పెళ్లయిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కూడా ఇదే రీతిలో కన్యత్వ పరీక్షలు చేశారు. వారిలో ఒకరు మాత్రమే ఆ పరీక్షను పాస్ అయ్యారు. మరొకరికి రక్తం రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. వధువు తల్లిదండ్రులను పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కులంలో పంచాయతీ పెట్టించి ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆ ఇద్దరు అన్నాదమ్ముళ్లు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. తమకు ఏలుకోవాలని ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు భర్తలను వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్తలకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు.
Latest News