by సూర్య | Sat, Apr 10, 2021, 10:35 AM
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీని, టీఎంసీని అధికారం నుంచి తొలగించడమే తమకు అతిపెద్ద సవాల్ అని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. రాష్ట్రంలో శనివారం నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆయన బరిలో ఉన్న టోలిగంజ్లోని గాంధీకాలనీ పోలింగ్ కేంద్రంలోకి భాజపా ఏజెంట్ను అనుమతించలేదు. దీంతో సుప్రియో స్వయంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఏజెంట్ ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించారు. దీంతో ఎన్నికల అధికారులు భాజపా ఏజెంట్ను లోపలికి అనుమతించారు.
అనంతరం బాబుల్ సుప్రియో మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీని, టీఎంసీ పార్టీని గద్దె దింపడమే తమకు అతి పెద్ద సవాలు అన్నారు. దీదీ చేసే పనులకు కుడి భుజంలా వ్యవహరించే అరూప్ బిశ్వాస్ ఈ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున పోటీ చేస్తున్నారు. కాబట్టి వారి భయంకర రాజకీయాలకు ముగింపు పలికి మార్పు తీసుకురావాలని సుప్రియో వెల్లడించారు.
భాజపా, టీఎంసీ వర్గాల ఘర్షణ
మరోవైపు కూచ్బెహర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శీతల్కూచి నియోజకవర్గ పరిధిలో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. లాఠీఛార్జ్ జరిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Latest News