by సూర్య | Sat, Apr 10, 2021, 10:32 AM
చుట్టపుచూపుగా కూతురు ఇంటికి వచ్చిన ఓ అత్త పెద్ద అల్లుడి నిర్వాకంతో రాత్రికి రాత్రే శవంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగరాం గ్రామానికి చెందిన 65 ఏళ్ల వయసున్న అమ్మాయమ్మకు ఇద్దరు కూతుళ్లు. వారికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. పెద్ద కూతురును చిట్టి ప్రసాద్ అనే వ్యక్తికి ఇచ్చి 31 ఏళ్ల క్రితం వివాహం చేసింది. వివాహం సమయంలో 33 సెంట్ల భూమిని కట్నంగా ఇచ్చింది. చూసి వెళ్లెందుకు శ్రీకాకుళంలో ఉంటున్న పెద్ద కూతురు, అల్లుడి ఇంటికి వచ్చింది అమ్మాయమ్మ. మూడు రోజులుగా అక్కడే ఉంటున్న ఆమెకు అల్లుడికి మధ్య శుక్రవారం సాయంత్రం గొడవ జరిగింది. తన పేరు మీద ఉన్న మరో ఆరు సెంట్ల భూమిని చిన్న కూతురు పేరు మీద రాస్తానని అత్త చెప్పడంతో పెద్ద అల్లుడు కోపోద్రేకుడయ్యాడు. ఆ భూమి కూడా తన పేరనే రాయాలని పట్టుపట్టాడు. నీకు ఇది వరకే భూమి ఇచ్చాను. మళ్లీ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో చిట్టి ప్రసాద్ సహనం కోల్పోయాడు. బతిమిలాడినా, బెదిరించినా వినకపోవడంతో ఇంట్లో ఉన్న రోకలి బండతో అత్తపై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన అమ్మాయమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మృతురాలి కుమారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన పెద్ద అల్లుడి కోసం గాలిస్తున్నారు. చుట్టపు చూపుగా కన్న కూతురు ఇంటికి వస్తే ఆమె భర్త అమ్మాయమ్మను తిరిగిరాని లోకాలకు పంపించాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
Latest News