by సూర్య | Fri, Apr 09, 2021, 02:35 PM
కోల్కతా : సీఆర్పీఎఫ్ జవాన్ల విషయంలో బెంగాల్ సీఎం మమత చేసిన విమర్శలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని తృణమూల్ ముందే గ్రహించిందని, తీవ్ర నిరాశలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. అందుకే కేంద్ర బలగాలపై అలా విరుచుకుపడుతున్నారని షా ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా శుక్రవారం బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ బటగాలను ఘోరావ్ చేయాలని పిలుపునిచ్చిన నేతను గానీ, సీఎంను గానీ తాను ఇప్పటి వరకూ చూడలేదని అన్నారు. విధ్వంసం సృష్టించడానికి మమత ప్రజలను ఉసిగొల్పుతున్నారా? అని షా సూటిగా ప్రశ్నించారు.
గత పదేళ్ల దీదీ పాలన ఏమాత్రం బాగోలేదని విమర్శించారు. బెంగాల్ ప్రజలు దీదీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీనిపై ఆమె ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో తృణమూల్ ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ''బెంగాల్ ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో దీదీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. శాంతిభద్రతలు ఘోరంగా క్షీణించాయి. అవినీతి పెరిగిపోయింది. బెంగాల్ ప్రజలు దీదీ పదేళ్ల పాలనపై విసిగిపోయారు'' అని షా పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడిందన్న వార్తలు సరైనవి కావని, ఆయా రాష్ట్రాలకు అవసరమైన మోతాదుల్లోనే కేంద్రం వ్యాక్సిన్లను పంపిందని స్పష్టం చేశారు. ఇకపై బెంగాల్ సోనార్ బంగ్లాగా మారుతుందని, బెంగాల్ అభివృద్ధి నిమిత్తమై తాము 22,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని అమిత్షా తెలిపారు.
Latest News