by సూర్య | Wed, Apr 07, 2021, 02:06 PM
కనకదుర్గమ్మకు భక్తులు నిత్యం, చీరలు, పసుపు కుంకుమ సమర్పిస్తారు. ప్రతిరోజూ వందలాది చీరలు అమ్మవారికి చెంతకు చేరతాయి. ఐతే ఈ చీరలను వేలం పాట ద్వారా విక్రయిస్తుంటారు. వంద రూపాయల నుంచి లక్ష రూపాయలు విలువ చేసే చీరలను భక్తులు అమ్మవారికి సమర్పిస్తుంటారు. భక్తుల మనోభావాలను ఆసరాగా చేసుకుంటున్న ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా అమ్మవారి పట్టుచీరల లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. చీరలను రికార్డుల్లో నమోదు చేయకుండా పక్కన పెడుతున్నట్లు వెల్లడైంది. చీరలు విక్రయించిన ధరలకు, బార్ కోడింగ్ ధరలకు భారీ వ్యత్యాసం కనిపించింది. రూ.15 వేలు విలువ చేసే చీరలను రూ.2,500లకే సిబ్బందే కొనుగోలు చేశారు. అలాగే రూ.7వేలు, రూ.3500 విలువ చేసే చీరలు చాలా వరకు మాయమయ్యాయి. కౌంటర్లో ఉండాల్సిన చీరలు బీరువాల్లో దర్శనమిచ్చాయి. చీరల కౌంటర్లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఈవో సురేష్ బాబు పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈవో సురేష్ బాబుపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
Latest News