by సూర్య | Wed, Apr 07, 2021, 12:33 PM
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిపాలెం గ్రామానికి చెందిన మోహనరావు, వెంకటేశ్వరమ్మ దంపతులకు మార్చి 4వ తేదీన మూడు కాళ్లతో ఆడ శిశువు జన్మించింది. మూడోకాలు వెన్నుముక భాగం నుంచి బయటకు ఉండటంతో డాక్టర్లు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ పాపను పరీక్షించిన న్యూరో విభాగం వైద్యులు ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు.
అక్కడి వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి మూడో కాలును తొలగించారు. నడుం భాగంలో మిగిలిన రెండు కాళ్లకు సంబంధించిన నరాలు కాలుకు అతుక్కుని పోవడంతో వాటిని ఆధునిక చికిత్స ద్వారా వేరు చేసినట్లు డాక్టర్లు తెలిపారు. నడుము నుంచి వచ్చిన మూడో కాలుకు పురుష జననంగాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు గుంటూరు జీజీహెచ్ లో ఇలాంటివే 21 కేసులు నమోదయ్యాయని, ఇది 22వ కేసు అని డాక్టర్లు తెలిపారు. తన బిడ్డకు గుంటూరు ప్రభుత్వ వైద్యులు ప్రాణం పోయడం ఆనందంగా ఉందని పాప తల్లి వెంకటేశ్వరమ్మ తెలిపారు. తమ పాపకు పునర్జన్మను ప్రసాదించారని ఆమె అన్నారు.
Latest News