by సూర్య | Fri, Apr 02, 2021, 09:15 AM
న్యూఢిల్లీ : ఓ పక్క సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉధృత పోరు కొనసాగుతుండగా... మరోపక్క మోడీ సర్కార్ తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. కార్మికుల పనిపరిస్థితులను దెబ్బతీసేలా ఉన్న లోబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. వాటి ప్రతులను కార్మికులు దహనం చేశారు. నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కులను తుంగలో తొక్కారని కార్మికులు విమర్శిస్తున్నారు. ఉద్యోగ, కార్మిక, రైతాంగంపై మోడీ సర్కార్ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పది కేంద్ర కార్మిక సంఘాల నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామిక కార్మికులు, ప్రభుత్వరంగ ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దేశ రాజధానిలోని జంతర్మతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కేంద్ర కార్మిక సంఘాల జాతీయ నాయకులు హాజరయ్యారు. బ్రిటిష్ కాలం నుంచి ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను కేంద్రంలో మోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్మిక హక్కులను కాలరాస్తుందని కార్మిక నేతలు విమర్శించారు. దేశవ్యాప్తంగా దాదాపు లక్ష ప్రదేశాల్లో, పారిశ్రామిక పట్టణాల్లో, వివిధ నగరాల్లో పెద్దఎత్తున ఈ కార్యక్రమం జరిగిందని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ అన్నారు. లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వీటిని ఉపసంహరించుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఐఎన్టియుసి, ఎఐసిసిటియు సహా ఇతర కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కేంద్ర కార్మిక సంఘాలతోపాటు.. ఢిల్లీ చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాల్లోని స్వతంత్ర కార్మికుల సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. బెల్సోనికా ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ సింగ్ మాట్లాడుతూ..ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. లేబర్ కోడ్లు కార్మికుల పరిస్థితిని మరింత దిగజారుస్తాయని పేర్కొన్నారు.
Latest News