by సూర్య | Wed, Mar 31, 2021, 01:42 PM
కొచ్చి: రాష్ట్రంలోని ప్రజా ఆస్తులను అమ్మడమే లక్ష్యంగా కేరళ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రా విమర్శించారు. కేరళలోని కరునాగప్పల్లి, కట్టకడ ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కేరళ సీఎం పినరయి విజయన్పై తీవ్ర విమర్శలు చేశారు.'కేరళ ప్రజలు నిజమైన బంగారం లాంటి వారు. కానీ, ఈ రాష్ట్ర సీఎం మాత్రం బంగారం స్మగ్లింగ్లో నిమగ్నమై ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలను అనుసరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారు' అని ప్రియాంకగాంధీ విమర్శించారు. 'ఈ ఎన్నికల్లో ప్రజలకు ఎంపిక చేసుకునేందుకు మూడు రకాల రాజకీయాలు వారి ముందున్నాయి. వాటిలో మొదటిది.. కుంభకోణాలు, హింస రాజకీయాలు చేసే సీపీఎం అయితే.. రెండోది ద్వేషం, విభజన సృష్టించే భాజపా.
ఇక మూడోది, కేరళ ఉజ్జ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేసే కాంగ్రెస్' అని ప్రియాంక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో వామపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడిందని ప్రియాంక ఆరోపించారు. కాగా, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.
Latest News