by సూర్య | Tue, Mar 30, 2021, 05:30 PM
కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అదే తేది నుంచి పలు నూతన నిబంధనలు రానున్నాయి. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏప్రిల్ 1 నుంచి టీవీలు,ఏసీలు,రిఫ్రిజిరేటర్లు,సెల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం రేట్స్ పెరగనున్నాయి. ఎల్ఐసీలో ఎలాంటి పెంపు లేదు.
ఏప్రిల్ 1 నుంచి ఐటీ రిటర్న్స్ కోసం ఇకపై ప్రీ-ఫిల్డ్ ఫామ్స్ రానున్నాయి. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.
ఆదాయపు పన్ను చట్టంలో కొత్తగా 206ఏబీ సెక్షన్ చేర్చింది ఆదాయపు పన్ను శాఖ. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారు టీడీఎస్పై ఎక్కువ రేట్ వసూలు చేసే నిబంధన ఇది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
ప్రతీ ఏటా ఈపీఎఫ్ అకౌంట్లో రూ.2,50,000 పైన జమ చేసేవారు ఇక వడ్డీ పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఆదాయంగా పరిగణిస్తుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ ప్రకారం పన్నులు చెల్లించాలి. ఈ రూల్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ప్రతీ నెల రూ.2,00,000 కన్నా తక్కువ వేతనం పొందుతున్నవారికి ఈ మార్పు వల్ల వచ్చే నష్టమేమి లేదు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో లీవ్ ట్రావెల్ కన్సెషన్-LTC వోచర్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్టీసీ స్కీమ్లో ఇచ్చిన మినహాయింపులు మార్చి 31న ముగుస్తాయి. ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు.
టూరిజంను ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ను అందిస్తోంది. టూర్ ఆపరేటర్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 30 రోజుల్లో పర్మిట్ లభిస్తుంది. ఈ కొత్త రూల్స్ 2021 ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయి.
ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ ద్వారా, ఫిక్స్డ్ డిపాజిట్పై వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నవారికి ఇది వర్తిస్తుంది.
ఒక కంపెనీలో ఐదేళ్లు వరుసగా సేవలు అందించిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి గ్రాట్యుటీకి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇక పై ఒక ఏడాది పనిచేసినా గ్రాట్యుటీ ఇవ్వాలి.
కొత్త వేతన కోడ్ ఏప్రిల్ 1న అమల్లోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం అలవెన్సులు 50 శాతం మించి ఉండకూడదు. ప్రస్తుతం బేసిక్ వేతనం 35 నుంచి 45 శాతం నుంచే ఉంటుంది. దీంతో బేసిక్ పే పెంచాల్సిన అవసరం ఉంది. బేసిక్ పే పెరిగితే అందులో 12 శాతం పీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి. కాబట్టి పీఎఫ్లో జమ చేసే మొత్తం కూడా పెరుగుతుంది. మొత్తంగా ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ తగ్గుతుంది.
భారత ప్రభుత్వం 8 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో పాత బ్యాంకులకు చెందిన పాస్బుక్స్, చెక్ బుక్స్ ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు. జయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Latest News