by సూర్య | Tue, Mar 30, 2021, 05:16 PM
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒకే బెడ్పై ఇద్దరు కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల ఉద్ధృతికి ఈ ఫొటోలు అద్దం పడుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా రోగులకు సరిపడా పడకలు అందుబాటులో లేవన్న సత్యాన్ని ఈ ఫొటో చెప్పకనే చెబుతోంది. తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలు నాగ్పూర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి (జీఎంసీహెచ్)లోనివి. ఇందులోని చాలా పడకలు ఇద్దరితో నిండిపోయాయి. ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య ఖర్చులు భరించలేని వారు ప్రభుత్వ ఆసుపత్రులలో చేరుతున్నారని, ఆ భారం నుంచి తప్పించుకునేందుకు రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూకడుతున్నారని అధికారులు తెలిపారు. వైద్యులు కూడా జీఎంసీహెచ్కు రెఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, పడకల సమస్యను పరిష్కరించామని, బెడ్స్ సంఖ్యను పెంచామని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ అవినాష్ గవాండే తెలిపారు. నాగ్పూర్లో సోమవారం 3,100 కేసులు నమోదయ్యాయి. అలాగే, 55 మంది మరణించారు. తాజా కేసులతో కలుపుకుని నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2,21,997కు పెరిగింది.
Latest News