by సూర్య | Tue, Mar 30, 2021, 04:37 PM
చనిపోయాడనుకుని అంత్యక్రియలు నిర్వహించిన 3 నెలలకు ఆ వ్యక్తి తిరిగొచ్చి కుటుంబ సభ్యులకు షాకిచ్చాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా కుదస్సనాడులో చోటుచేసుకుంది. సాబూ అనే వ్యక్తి క్యాటరింగ్, బస్ క్లీనింగ్ వంటి ఉద్యోగాలు చేస్తూ.. చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఓసారి తను పనిచేసే హోటల్ లో డబ్బు చోరీ జరిగింది. ఆ కేసులో పోలీసులు సాబూను గతేడాది నవంబర్ లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని గురించి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు.
ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 24న కొట్టాయం జిల్లా పాలా పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. తిరువనంతపురం పోలీసులు ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి సాబూ కావచ్చనే అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం సాబూదేనని పొరపాటు పడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ఒక బస్ డ్రైవర్ కు సాబూ కనిపించాడు. వెంటనే అతడు ఈ సమాచారాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఇప్పుడు పోలీసులు..గత డిసెంబర్ లో అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Latest News