by సూర్య | Tue, Mar 30, 2021, 04:19 PM
చైనాలోని ఓ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చిందన్న వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో), చైనా పరిశోధకుల ఉమ్మడి బృందం కొట్టిపారేసింది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు మరో జంతువు ద్వారా సోకి ఉండవచ్చని తెలిపింది. చైనాలోని హువానన్ మార్కెట్ లో మొదటిసారిగా వైరస్ కేసులు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వారు నివేదికలో ప్రస్తావించారు. కరోనా వైరస్ ఇతర ప్రాంతాల్లో మొదలై అక్కడికి వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు. ఆ మార్కెట్ లో భారీ సంఖ్యలో ఎలుకలు, దుప్పులు, మొసళ్లు వంటి రకరకాల జీవుల విక్రయాలు జరగడంతో.. వాటి ద్వారానే వూహాన్ కు కొత్త వైరస్ వచ్చి ఉంటుందని అంచనా వేసింది.
అయితే ఈ నివేదిక విడుదల పలుమార్లు వాయిదా పడటంతో చైనా అందులో తన అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేసిందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైరస్ మూలాలను కనుగొనేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్వో బృందానికి చైనా ప్రభుత్వం కీలకమైన పత్రాలేవీ అందుబాటులో లేకుండా చేసిందనే ఆరోపణలున్నాయి. వూహాన్ లోని వైరాలజీ ఇన్స్టిట్యూట్ లో పలువురు చైనా శాస్త్రవేత్తలను ఈ బృందం కలుసుకుంది. ఇక్కడ నాలుగు గంటలపాటు గడిపింది. వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావించే వూహాన్ మార్కెట్లో నాలుగు గంటలపాటు గడిపింది. కానీ, చాలా రోజులపాటు ఏ పనీ లేకుండా తమకు కేటాయించిన హోటల్ లోనే కాలక్షేపం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు.
Latest News