by సూర్య | Sat, Mar 27, 2021, 01:08 PM
కోవిడ్ నిబంధనలు సామాన్యులకేనా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ మెదలైందని ప్రభుత్వాలు తల కొట్టుకుంటుంటే గుంటూరు జిల్లా తాడేపల్లి లోని సచివాలయ సిబ్బంది తమకేది పట్టదు అన్నట్లు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాడేపల్లి పట్టణంలోని మున్సిపల్ అతిధి గృహంలో శుక్రవారం సచివాల సిబ్బంది భౌతిక దూరం పాటించకుండా ఓ మహిళా ఉద్యోగి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడంపై స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
అతిధి గృహం పై అంతస్థులో ఓ ఉద్యోగి కరోనా పాజిటీవ్ తో విశ్రాంతి తీసుకుంటుండగానే క్రింది అంతస్థులో జన్మదిన వేడుకలు నిర్వహించడంతో స్థానికులు ఆశ్యర్యానికి గురయ్యారు. ఎటువంటి భయం లేకుండా కనీసం సామాజిక దూరం పాటించకుండా జరుపుకుంటున్న వేడుకలకు సంభందించి చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ వేడుకల్లో ప్రయివేటు వ్యక్తులు పాల్గొనడం, చాలా మంది మాస్కులు ధరించలేదన్న సమాచారం ఉన్నతాధికారులకు చేరింది. పట్టణంలో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అందరికి చెప్పాల్సిన సచివాలయ సిబ్బంది ఇలా వేడుకలు చేసుకోవడం విమర్శలకు దారి తీస్తుంది.
మున్సిపల్ అతిధి గృహాన్ని తమ స్వంత అవసరాలకు వినియోగించుకోవడంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రతి దుకాణం ముందు నో మాస్క్ నో ఎంట్రీ అని బోర్డులు ఏర్పాటు చేయాలని, మాస్క్ లేకపోతే రూ. 1000 జరిమానా అని చెప్పే మున్సిపల్ అధికారులు వారి సిబ్బంది చేసిన పనికి ఎలా సమాదానం చెబుతారో వేచి చూడాలని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా నిబంధనలు సామాన్యులకే నని అధికారులకు కాదని స్పష్టం అవుతుంది.
Latest News