by సూర్య | Thu, Mar 25, 2021, 05:24 PM
ఏప్రిల్ 1 నుండి, 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. తద్వారా వివిధ ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారిపోనున్నాయి. ఈ మార్పులు ఆయా కస్టమర్లను ప్రభావితం చేయబోతున్నాయి. కాగా, నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. అలా విలీనం చేసిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్లు ఉన్నాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఈ బ్యాంకుల విలీన ప్రక్రియ 2020 ఏప్రిల్ 1 వరకు కొనసాగింది. ఈ బ్యాంకుల విలీనం పూర్తయినప్పటికీ, వాటి పాస్బుక్లు, చెక్బుక్లు మాత్రం చెల్లుబాటవుతూ వచ్చాయి. అయితే, ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్బుక్లు, పాస్బుక్లు చెల్లుబాటు కావు. ఈ ఏడు బ్యాంకుల చెక్ బుక్ నిలిపివేయడం అనేది ఆయా బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ అవసరాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. కాబట్టి, ఈ ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులలో దేనిలోనైనా మీకు ఖాతా ఉన్నట్లైతే ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి.
Latest News