by సూర్య | Thu, Jan 21, 2021, 09:22 AM
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ కొత్త చీఫ్ను ఎన్నుకునే మార్గాన్ని సుగమం చేయనున్నట్లు సమాచారం. పార్టీ నిర్ణేత అయిన సీడబ్ల్యూసీ సభ్యులు సంస్థాగత ఎన్నికల, ఏఐసీసీ ప్లీనరి సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మధుసూదన్ మిస్త్రీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల అథారిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనంటూ సోనియాకు తెలుపడంతో పాటు పలు సిఫారసులు చేసిందని సమాచారం. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమావేశం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరుగనుంది. ఇప్పటికే పార్టీ నేతలంతా పార్టీ అధ్యక్ష పదవితో సహా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. 2019 మేలో పార్టీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో సోనియా గాంధీ తాతాల్కి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పార్టీకి పూర్తికాల అధ్యక్షుడి నియమించాలని, అలాగే సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని సీడబ్ల్యూసీ ఇంతకు ముందు నిర్వహించిన సమావేశంలోనే నిర్ణయించింది. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, భూపిందర్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, కపిల్ సిబల్, మనీశ్ తివారీ, ముకుల్ వాస్నిక్ సహా 23 మంది నాయకుల బృందం సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ గత నెలలో కొందరు లేఖ రాసిన నేతలతో సమావేశమై, వారు లేవనెత్తిన అంశాలపై చర్చించారు. ఆమె నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి వారం రోజుల ముందు సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Latest News