by సూర్య | Wed, Jan 20, 2021, 02:35 PM
గువహటి : రానున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్)తో కలిసి పోటీ చేస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎఐయుడిఎఫ్ను కాంగ్రెస్ దూరం పెట్టనుందన్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. అదేవిధంగా మరో ప్రాంతీయ పార్టీ అంచాలిక్ గణ మోర్చా కూడా కూటమిలో భాగం కానుందని మంగళవారం రాత్రి కాంగ్రెస్ వెల్లడించింది. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్), ఎఐయుడిఎఫ్, అంచాలిక్ కూటమిగా ఏర్పడి...పోటీకి దిగనున్నాయి. బిజెపిని అడ్డుకునేందుకు కూటమిగా ఏర్పడినట్లు కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నీ, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రకటించారు. మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కూటమిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కూటమిని కాంగ్రెస్ ఒక్కటే కూడదీయలేదని..ఆ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయని, అసోం ప్రజలు ఇదే కోరుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్చార్జ్ జితేంద్ర సింగ్ తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ద్వేషపూరితమైన కొత్త రాజకీయాలు పుట్టుకొచ్చాయని, బిజెపి సాగనంపాలని ప్రజలు కోరుతున్నారని, అందుకే ఒకే భావజాలం ఉన్న పార్టీలన్నీ చేతులు కలిపాయని అన్నారు. ముందస్తు షరతులేమీ లేకుండానే పార్టీలు కూటమిలో చేరేందుకు అంగీకరించాయని తెలిపారు.
ఈ ప్రకటన అసోం ప్రజల అంచనాకు తగ్గట్లుగా ఉందని, ఈ కూటమి బిజెపిని ఓడిస్తుందని ఎఐయుడిఎఫ్ ప్రధాన కార్యదర్శి అమినుల్ ఇస్లామ్ అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్..తమ పార్టీ కలిసి పోటీ చేయలేదని, దీంతో ఓటు విభజన కారణంగా 27 స్థానాలు కోల్పోయామని అన్నారు. ప్రస్తుతం బిజెపి వ్యతిరేక ఓట్లను కూడదీసే పనిలో ఉన్నామని, తాము అధికారంలోకి వస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ గుజరాత్ తరహా ప్రభుత్వాన్ని ప్రజలు చూశారని, చత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం 36 హామీలకు 24పూర్తి చేసిందని ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. కోవిడ్కు ముందు దేశం ఆర్థిక మందగమనాన్ని చూసినప్పటికీ..అక్టోబర్లో జిఎస్టి వసూళ్లలో రాష్ట్రం ముందంజలో ఉందని, తమకు మంచి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.
Latest News