by సూర్య | Mon, Jan 18, 2021, 03:30 PM
ఓ వ్యక్తి కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన తమిళనాడులోని తంజవూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..పాపనాశంకు చెందిన నిందితుడు భార్య 2003లో కూతురుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత అతడు ఇంటి నుంచి వెళ్లిపోయి ముంబైలో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఇక ముంబైలో జీవనం సాగిస్తున్న నిందితుడు అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు తండ్రి విడిచి వెళ్లడంతో ఒంటరైన చిన్నారిని ఆమె తాతయ్య, నానమ్మ పెంచారు. ఇక, గతేడాది మార్చిలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అతడు రెండో భార్య, పిల్లలతో కలిసి ముంబై నుంచి సొంతూరికి వచ్చాడు. అయితే సొంతూరికి వచ్చాక నెల రోజుల వ్యవధిలోనే భార్యభర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అతడు ఊర్లోనే రైస్ మిల్లో పనికి చేరాడు.
అలాగే తల్లిదండ్రుల వద్ద ఉంటున్న 17 ఏళ్ల కూతురిని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఏప్రిల్ నెలలో ఒక రోజు రాత్రి తాగిన మత్తులో ఇంటికి వచ్చిన అతడు కూతురిపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అనంతరం పలుమార్లు కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో లైంగిక దాడి భరించలేని ఆమె తిరిగి తాతయ్య, నానమ్మల వద్దకు వెళ్లింది. అయితే జనవరి 11వ తేదీన ఆ మైనర్ బాలిక పాపనాశంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు బాధిత బాలిక వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పాపనాశం పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.