by సూర్య | Mon, Jan 18, 2021, 03:28 PM
గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్టాండ్ ఎదురు జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా బస్సులోని 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే ఒంగోలు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 27 జెడ్ 0342 నంబరు గల బస్సు ఒంగోలు నుంచి విజయవాడ వెళుతుంది. బస్సులో 39 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో దాటిన వెంటనే ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న ఏపీ 07 ఏబి 2525 నంబరు గల కారును తప్పించబోయి బస్సును పక్కకు తిప్పాడు. దీంతో బస్సు డివైడర్ను ఢీ కొట్టి సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ఎస్.కె ట్రేడర్స్ అనే రేకుల దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో విద్యుత్ హై టెన్షన్ స్తంభాన్ని బస్సు ఢీ కొనడంతో అది విరిగి పడిపోయింది.
అదృష్టవశాత్తు విద్యుత్ లైన్లు ట్రిప్ అయ్యి సరఫరా నిలిచిపోవడంతో బస్సులోని 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సు రేకుల దుకాణం లోకి దూసుకెళ్లడంతో అందులో నిద్రిస్తున్న వాచ్ మెన్ బెల్లంకొండ స్వామి (35) దుర్మరణం చెందాడు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బస్సును బయటకు తీయించారు. ఎస్ఐ పి.రాంబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్వామికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.