by సూర్య | Sun, Jan 17, 2021, 12:16 PM
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఉమారియా జిల్లాలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంవది. బాలికను కిడ్నాప్ చేసి ఐదు రోజుల పాటు నరకం చూపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 13 ఏళ్ల బాలికను ఈ నెల 4న ఆమెకు తెలిసిన ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. అనంతరం అతనితో పాటు ఆరుగురు స్నేహితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 5న బాలికను వదిలిపెట్టాడు.
లైంగిక దాడికి సంబంధించిన విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. ఆరు రోజుల తర్వాత 11న మళ్లీ సదరు బాలికను మొదట లైంగిక దాడికి పాల్పడిన ఏడుగురిలో ఒకడు మళ్లీ కిడ్నాప్ చేసి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి మరో ముగ్గురితో కలిసి దుర్మార్గానికి ఒడిగట్టారు. బాలికను వదిలిపెట్టిన అనంతరం మరో ఇద్దరు ట్రక్ డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక శుక్రవారం తెల్లవారు జామున పారిపోయి ఇంటికి చేరింది.
విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని..మిగిలిన వారిని పట్టుకుంటామని చెప్పారు. పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి అరవింద్ తివారి చెప్పారు.