by సూర్య | Tue, Jan 12, 2021, 09:02 AM
భారత క్రికెట్ జట్టు చేసుకున్న అద్భుతమైన డ్రాలలో సిడ్నీ టెస్ట్ మ్యాచ్ కూడా ఒకటి. ఎందుకంటే భారతజట్టులోని ఆటగాళ్లు గాయాల బాధలో ఉన్నా కూడా టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేస్తూ అనుకున్నది సాధించారు. ముఖ్యంగా పంత్ ఆడుతున్న సేపు భారత్ విజయానికి దగ్గరగా వెళుతోంది అని అనిపించింది. పుజారా అవుట్ అయ్యాక మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్ళింది. కానీ భారత్ ఈ మ్యాచ్ ను డ్రా చేయడానికి సర్వ శక్తులను సన్నద్ధం చేసుకుంది. అశ్విన్-హనుమ విహారి జోడీ అద్భుతంగా ఆడారు. తమకు ఏమైనా పర్వాలేదు. మ్యాచ్ ను డ్రా చేయాలి అని అనుకున్నారు. వీరిద్దరిలో ఎవరైనా అవుట్ అయితే.. రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు రావాల్సిన తరుణం.. జడ్డూ వేలుకి ఫ్రాక్చర్ అవ్వడంతో అందరిలోనూ ఒకటే టెన్షన్. కానీ అశ్విన్-హనుమ విహారి జోడీ ఆసీస్ పేస్ అటాక్ నుండి కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. బాడీ మీదకు బంతులు వస్తున్నా వాటిని కూడా తగిలించుకున్నారు. సెషన్ మొత్తం ఆడాలి.. ఒక్క వికెట్ కూడా పడనివ్వకూడదు. అలానే ఆడారు.. అనుకున్నది సాధించారు. ఆసీస్ ఫీల్డర్లు కవ్విస్తున్నా పట్టించుకోలేదు.. బంతులు శరీరం మీదకు కావాలనే విసురుతున్నా పట్టించుకోవట్లేదు.. అలా ఆడుతూ సాగిపోయింది ఈ జోడీ..! అశ్విన్ 128 బంతులాడి 39 పరుగులు చేశాడు. తెలుగు తేజం హనుమ విహారి (161 బంతుల్లో 23 పరుగులు)తో కలిసి అజేయ భాగస్వామ్యంతో డ్రాగా ముగించారు.
ఇక అశ్విన్ మరీ కంప్లీట్ బ్యాట్స్మెన్ కాకపోయినా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం. స్పిన్నర్ లయన్ ను అద్భుతంగా కట్టడి చేశాడు అశ్విన్. అతడి బౌలింగ్ లో అశ్విన్ డిఫెన్స్ సూపర్ అనే చెప్పొచ్చు. ఇక అశ్విన్ గురించి ఆయన భార్య ప్రీతి ఆసక్తికర అంశం వెల్లడించింది. రెండో ఇన్నింగ్స్ ముందు అశ్విన్ తీవ్ర వెన్నునొప్పితో బాధపడ్డాడని, ఇవాళ ఉదయం నిటారుగా నిలబడలేకపోయాడని తెలిపింది. కనీసం కిందకు వంగి షూ లేసులు కూడా కట్టుకోలేకపోయాడని, అలాంటివాడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను డ్రా దిశగా మళ్లించాడంటే నమ్మశక్యం కావడం లేదని తెలిపింది. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతూ ఉన్నారు. 256 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేసి భారత్ ను గట్టెక్కించిన విహారి, అశ్విన్ జోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Latest News