by సూర్య | Mon, Jan 11, 2021, 03:39 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీలో చేరేందుకు ఎమ్మెల్సీ పదవి వదులుకున్న పోతుల సునీతను ఆ పార్టీ తమ అభ్యర్ధిగా ప్రకటించింది. ఇవాళ పోతుల సునీత సీఎం జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసి బీ ఫారం తీసుకున్నారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు సునీత సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. సునీతతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పోతుల సురేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవికి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోతుల సునీత గతేడాది రాజీనామా చేశారు. మూడు రాజధానులపై శాసనమండలిలో చర్చ సందర్భంగా ఆమె టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి వదులుకున్నారు. సునీత రాజీనామాను ఆ తర్వాత శాసనమండలి ఛైర్మన్ ఆమోదించారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు 18వ తేదీ వరకూ గడువు ఉంది. జనవరి 19 వరకూ నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 21 గడువుగా ఇచ్చారు. జనవరి 28న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.