by సూర్య | Mon, Jan 11, 2021, 01:37 PM
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కరోనా మహమ్మారి కలకలం ఆగడంలేదు. ఎక్కడికక్కడ తన రూపాన్ని మార్చుకుని మరీ విజృంభిస్తోంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా, అమెరికాల్లో రూపం మార్చుకుని వ్యాపిస్తున్న ఈ మహమ్మారి.. తాజాగా జపాన్ లోనూ అడుగుపెట్టింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో కొత్త రకం వైరస్ గుర్తించామని.. ఇది ఇప్పటివరకు వెలుగుచూసిన వైరస్ ల కంటే భిన్నంగా ఉందని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.
వైరస్ గుర్తించిన వ్యక్తుల్లో తొలుత లక్షణాలు కనిపించలేదని.. అయితే, క్రమంగా ఓ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్త వైరస్ కనుగొన్నట్టు పేర్కొంది. మరో వ్యక్తిలో మాత్రం జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినట్టు వివరించింది. ఈ విషయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసిన జపాన్.. కొత్త వైరస్ పై జన్యు విశ్లేషణ జరపాలని కోరింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఏది ఎంతమేర కొత్త వైరస్ పై పనిచేస్తుందనే విషయం కూడా తెలియజేయాలని విన్నవించింది. మరోవైపు ఇప్పటికే జపాన్ లో 30 మందిలో బ్రిటన్, దక్షిణాఫ్రికా వేరియంట్లను గుర్తించారు.