by సూర్య | Sat, Jan 09, 2021, 12:24 PM
రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలు. అటు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే జోరు కనబరుస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినా...జగన్ పై విమర్శల దాడికి దిగినా రోజా పులిలా విరుచుకుపడతారు. అవతలి వారు ఎవరైనా సరే వదలరు. దీంతో రోజాకు చెక్ పెట్టేందుకు ఏపీ బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలు నిర్వహించే సమయానికి నగరిలో మరో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ను బరిలోకి దింపటానికి బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ ను బరిలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాణివిశ్వనాథ్ను బీజేపీలోకి తీసుకొచ్చి.. రోజాకు పోటీగా మరో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్గా ఆమెను ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ నేతలు ప్లాన్ చేసినట్టు కమలదళంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఆమెతో చర్చించినట్టు చెబుతున్నారు. అన్నీ కుదిరితే తిరుపతి ఉప ఎన్నికల సమయానికి వాణీ విశ్వనాథ్ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా తెలుస్తోంది. తిరుపతి ఉపఎన్నికలు జరిగే సమయంలో జిల్లాకు చెందిన ముఖ్య నేత అయిన రోజా ఎన్నికల కాంపైన్ లో పాల్గొనాల్సి వస్తోంది. దీంతో ఆమెకు వాణీ విశ్వనాథ్ తో కౌంటర్ ఇప్పించేలా బీజేపీ ప్లాన్ వేస్తోంది.