by సూర్య | Fri, Jan 08, 2021, 04:01 PM
నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసంలో జరిగింది. సాగు చట్టాలపై రైతుల ఆందోళన గురించి వీరు చర్చించారు. మరోవైపు రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన ఓ ట్వీట్లో, దేశ ప్రజలంతా రైతులకు మద్దతుగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం తన పెట్టుబడిదారీ మిత్రులకు ప్రయోజనం కల్పించేందుకు దేశ అన్నదాతలకు ద్రోహం చేసిందని ఆరోపించారు. ఈ ఉద్యమం ద్వారా రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారని, ఇక మనమంతా రైతులకు మద్దతుగా గళమెత్తాలని, ఇది మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభించింది. ఎనిమిదో విడత జరుగుతున్న ఈ చర్చలు ఫలప్రదమవుతాయనే ఆశాభావాన్ని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ వ్యక్తం చేశారు. ఓ పరిష్కారం లభించగలదనే ఆశాభావంతో చర్చలకు వెళ్తున్నామన్నారు. అదేవిధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఈ చర్చలు సత్ఫలితాలిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలు సానుకూల వాతావరణంలో జరుగుతాయని, ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఓ పరిష్కారం కోసం ఇరు వర్గాలు చర్యలు తీసుకోవాలన్నారు.
Latest News