by సూర్య | Fri, Jan 08, 2021, 04:23 PM
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి భూమా అఖిలప్రియకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న భూమా అఖిలప్రియ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బోయిన్ పల్లి పోలీసులు భూమా ప్రయత్నాలకు చెక్ పెట్టారు. భూమా అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దంటూ బోయిన్ పల్లి పోలీసులు కోర్టును కోరారు. శనివారం నుంచి వారం రోజులపాటు అంటే ఈనెల 15 వరకు కస్టడీ ఇవ్వాల్సిందిగా కోరారు. అంతేకాదు రిమాండ్ కోర్టులో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కిడ్నాప్ కి పాల్పడిన 15 మందిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నేర చరిత్ర తెలియాలంటే కస్టడీ ఇవ్వాలని కోరారు. మరోవైపు భూమా అఖిలప్రియపై కిడ్నాప్ కి గురైన వారు కీలక ఆరోపణలు చేశారు. తమపై పలు పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. దీంతో ఆ పేపర్లు ఏంటి..ఎక్కడ ఉన్నాయి అన్న కోణంలో విచారణ చేపట్టాలని ఈ నేపథ్యంలో వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు.