by సూర్య | Fri, Jan 08, 2021, 03:45 PM
కరోనా వైరస్ పుట్టి దాదాపుగా ఏడాది కాలం కావస్తోంది. ఇప్పటికే కరోనా ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా సోకుతుందో తెలియని పరిస్థితి. బంధువుల ద్వారా అయినా కరోనా సోకుతుందేమోనన్న భయంతో వారిని సైతం దూరం పెట్టారు. బయటకు వెళ్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు మహమ్మారికి బలవుతూనే ఉన్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులకు శానిటైజర్ పూజుకోవడం చేయడంతో క్రమంగా ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది.
ఇక ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రయాణాలు చేస్తున్నారు. మరికొంతమంది అయితే రక్షణ కోసం పీపీఈ కిట్లు ధరించి ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం కరోనా నుంచి రక్షణ కోసం విమానంలోని సీట్లన్నింటినీ బుక్ చేసుకున్నాడు. ఆ ప్రయాణికుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఫొటో వైరల్ అవుతోంది. జకార్తాకు చెందిన రిచర్డ్ ముల్జాదీ అనే సోషలిస్టు ఇటీవల బాలీకి వెళ్లారు. రిచర్డ్ వెంట అతడి భార్య షల్విన్నీ ఛాంగ్ కూడా ఉన్నారు.
ఈ ప్రయాణం కోసం ఆయన లయన్ ఎయిర్ గ్రూప్నకు చెందిన బాటిక్ ఎయిర్ విమానంలో అన్ని టికెట్లనూ బుక్ చేసుకున్నారు. విమానంలో ఇతర ప్రయాణికులు ఉంటే వారి నుంచి కరోనా సోకే ప్రమాదం ఉందని భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిచర్డ్ తెలిపారు. విమానంలో ఉన్న ఫోటోను రిచర్డ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ‘ఫ్లైట్లో సీట్లన్నీ బుక్ చేశా.. అయినా, ప్రైవేట్ జెట్ కంటే తక్కువే ఖర్చయ్యింది. మాకు కరోనా సోకే ప్రమాదం లేదు. విమానంలో నేను, నా భార్య మాత్రమే ఉన్నాం’ అని ఆయన రాసుకొచ్చారు.
విమానంలోని సీట్లన్నీ బుక్ చేయడానికి ఎంత ఖర్చయ్యిందనే వివరాలను మాత్రం రిచర్డ్ చెప్పలేదు. విమానం మొత్తం బుక్ చేసుకున్నా.. ప్రైవేట్ జెట్లో ప్రయాణ ఛార్జీల కంటే తక్కువే అయిందని రిచర్డ్ చెప్పడం గమనార్హం.