by సూర్య | Fri, Jan 08, 2021, 03:28 PM
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హత్యకు సంబంధించి బెదిరింపు లేఖ సంచలనంగా మారింది. నవీన్ పట్నాయక్ హత్యకు పక్కా స్కెచ్ వేశారంటూ ఏకంగా సీఎం కార్యాలయానికి లేఖ వచ్చింది. అంతేకాదు అత్యాధునిక వెపన్స్, ప్రొఫెషనల్ కిల్లర్లతో మర్డర్ చేసేందుకు ప్లాన్ వేశారంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు హత్యకు సంబంధించిన స్కెచ్ ను కూడా పొందుపరిచారు. అయితే ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది..ఎవరు పంపించారు అన్న దానిపై క్లారిటీ లేదు.
అనామక వ్యక్తి ఈ లేఖ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యమంత్రికి ఇలాంటి లేఖ రావడంతో రాష్ట్రంలో అలజడి రేగింది. దీంతో రాష్ట్రహోంశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. సీఎం సెక్యూరిటీ విభాగంతోపాటు పోలీసులను అలర్ట్ చేసింది. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. లేఖకు సంబంధించి వివరాలను సేకరించే పనిలో పడింది. ఇది ఆకతాయి పనా లేక ఏదైనా కుట్ర దాగి ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.