by సూర్య | Fri, Jan 08, 2021, 01:10 PM
తనను అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయ్యాక తాను జాబ్ చేస్తానని చెబితే.. తన భర్త ఒప్పుకున్నాడని, ఇప్పుడు వద్దంటున్నాడని, అలాగే జీన్స్ వేసుకోకూడదని నిషేధం విధించాడని తెలిపింది. ఈ ఘటన అహ్మదాబాద్ లోని సర్ఖేజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
జుపుహారాకు చెందిన ఓ 37 ఏళ్ల మహిళకు 2017లో ఐటీ కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తితో వివాహం అయింది. ఆ మహిళకు ఇది రెండో వివాహం. ఆమె భర్తకు మూడో వివాహం. వివాహం అయ్యాక వేరు కాపురం పెడతానని, ఆమె జాబ్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అతడు పెళ్ళికి ముందు ఆమెకు మాట ఇచ్చాడు. పెళ్లి తర్వాత కొద్ది రోజులకే అతడు మాట తప్పాడు. ఆమెను ఏ ఫంక్షన్ కి వెళ్లకుండా అడ్డుకున్నాడు. జీన్స్ ధరించకుండా నిషేధం విధించాడు. ఆమె తండ్రి కొనిచ్చిన ఫ్లాట్ లో ఉండేందుకు నిరాకరించాడు. దీంతో ఆ మహిళ ఆశలన్నీ ఆవిరయ్యాయి.
పిల్లలు పుట్టకపోవడానికి ఆ మహిళనే కారణమని భర్తతో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ఆమెను వేధించడంతో.. తీవ్ర నిరాశ చెందిన ఆమె సర్ఖేజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గృహహింస కింద కేసు నమోదు చేయాలని కోరింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.