by సూర్య | Fri, Oct 16, 2020, 03:16 PM
అయ్యప్ప శరణుఘోషతో మారుమోగే శబరిమల ఆలయం భక్తుల కోసం ఈరోజు తెరుచుకోనుంది. కరోనా నేపథ్యంలో మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. నెలవారి పూజాకార్యక్రమాల్లో భాగంగా ఈ సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అయితే రేపు (శనివారం) తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను ఆలయంలోని అనుమతించనున్నట్టు ట్రావెంకోర్ దేవస్వోం బోర్డు ప్రకటించింది.
మరోవైపు, అయ్యప్ప దర్శనార్థమై వచ్చే భక్తులకు కేరళ ప్రభుత్వం పలు షరతులను విధించింది. భక్తులందరూ ఈ నిబంధలనను తెలుసుకోవాలని కోరింది.
అయ్యప్ప భక్తులకు విధించిన నిబంధనలు ఇవే:
ప్రతి ఒక్కరూ కరోనా నెగెటవ్ వచ్చిన రిపోర్టును తీసుకురావాలి. ఈ టెస్టును దర్శన సమయానికి 48 గంటల ముందు చేయించుకుని ఉండాలి.
నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దర్శనానికి సంబంధించి వర్చువల్ క్యూ పోర్టల్ లో పేరు నమోదు చేసుకోవాలి.
శబరి కొండను ఎక్కేందుకు అవసరమైన ఫిట్ నెస్ ఉన్నట్టు మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి.
రోజుకు కేవలం 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
10 ఏళ్ల లోపు చిన్నారులకు, 60 ఏళ్లు దాటిని పెద్దలకు అనుమతి లేదు.
అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేయడం, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బస చేయడానికి అనుమతించరు.
ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఇతర దారులను తాత్కాలికంగా మూసి ఉంచుతారు.
Latest News