by సూర్య | Mon, Oct 12, 2020, 11:21 AM
తమిళ సినీ నటి ఖుష్బూ సుందర్ భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆ పార్టీలో చేరే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమెను ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి ఆ పార్టీ తప్పించింది. దీంతో ఖుష్బూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు .. గ్రౌండ్ రియాల్టీ తెలియకుండానే ఆదేశాలు ఇస్తున్నారని, ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఖుష్బూ ఇవాళ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిస్తున్నాయి. 2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ను వీడుతున్నారా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు .. తానేమీ చెప్పడానికి ఇష్టపడడం లేదన్నారామె.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ నుంచి ఖుష్బూ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో బీజేపీ ముఖచిత్రాన్ని ఖుష్బూ మార్చేస్తుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె డీఎంకేలో కూడా చేరారు. 2010లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో ఖుష్బూ ఆ పార్టీకి పనిచేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు ఆ పార్టీని వీడిన ఖుష్బూ.. సోనియా గాంధీతో భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు.
Latest News