by సూర్య | Thu, Oct 08, 2020, 10:59 AM
లాక్డౌన్ నష్టాలను పూడ్చుకునేందుకు, బ్యాంక్ లోన్ కట్టేందుకు రెడీమేట్ బట్టల వ్యాపారం చేసే 25 ఏళ్ల వ్యక్తి తాను రుణం తీసుకున్న బ్యాంకుల్లోనే దోపిడీకి పాల్పడిన ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. యూట్యూబ్ వీడియోలను చూస్తూ నిందితుడికి ఈ ఐడియా వచ్చిందని, బొమ్మ తుపాకీని ఉపయోగించి రెండు బ్యాంకుల్లో దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. రెండు బ్యాంకుల్లో 12 లక్షల రూపాయలను నిందితుడు దోచుకోగా అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడి నుంచి 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ సమీపంలోని తంగిబంట గ్రామానికి చెందిన సౌమ్యరంజన్ జెనా అలియాస్ తులు భువనేశ్వర్లోని ఐఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతనెల దోపిడీకి పాల్పడ్డాడని నగర పోలీస్ కమిషనర్ సుధాంషు సారంగి తెలిపారు. రెండు బ్యాంకుల్లో నిందితుడికి ఖాతాలున్నాయని, ఆయా బ్యాంకుల నుంచి 19 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంకును దోచిన అనంతరం తాను తీసుకున్న రుణంలో కొంత భాగం చెల్లించేందుకు నిందితుడు బ్యాంకుకు వచ్చినట్టు గుర్తించారు. బ్యాంకు రుణంతో వ్యాపారం ప్రారంభించిన నిందితుడు 9 నుంచి 10 లక్షల టర్నోవర్ సాధించినా లాక్డౌన్ సమయంలో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.
Latest News