by సూర్య | Wed, Oct 07, 2020, 04:29 PM
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో కొన్ని రోజుల క్రితం ఓ యువతి హత్యాచారానికి గురైన ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఆ ఘటనను మరవకముందే అదే రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల దళిత బాలిక పరువు హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఆ బాలికను తండ్రి, సోదరుడే తీవ్రంగా హింసించి గొంతు కోసి చంపేశారు.
అనంతరం బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి ఖననం చేశారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు తెలిపారు. షహజన్పూర్ జిల్లాలో ఓ బాలిక గర్భం దాల్చింది. దీంతో గ్రామంలో ఆమె కారణంగా తమ పరువుపోతోందని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి, సోదరుడు దారుణంగా హత్య చేసి, ఖననం చేశారు.
గత నెల 23న ఆ బాలిక అదృశ్యమైందని, అయినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం లభ్యం కావడంతో కేసును ఛేదించామని చెప్పారు. ఆ బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించాడని, ఆమె సోదరుడు పరారీలో ఉన్నాడని వివరించారు. మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరమని, ఆమెకు గర్భం రావడానికి బాధ్యుడైన వారిని పట్టుకుంటామని చెప్పారు.
Latest News