by సూర్య | Wed, Oct 07, 2020, 03:55 PM
ఈజిప్టు చరిత్రలో మమ్మీలు ఒక భాగం. ఇటువంటి మమ్మీలను వెలికి తీయడంలో అక్కడి సైంటిస్టులు అమితమైన ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను బయటకు తీశారు. సక్కారా అనేది ఈజిప్టులోగల అత్యంత పురాతన శ్మశానవాటిక. ఇక్కడ బయటపడిన ఈ మమ్మీలు సుమారు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తలు శవపేటికలను బయటకు తీసి, అందులోని మమ్మీలు చెక్కుచెదరకుండా ఉండటాన్ని గమనించారు.
ఈ మమ్మీలు ఈజిప్టుకు చెందిన పూజారులు, ఇతర ప్రముఖులవిగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఈజిప్ట్ పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 9 మిలియన్ల మంది చూశారు. ఈజిప్టు పర్యాటకశాఖ తెలిపిన వివరాల ప్రకారం తొలుత 13 శవపేటికలను సక్కారాలోని మూడు బావులలో కనుగొన్నారు. ఆ తర్వాత మొత్తం 59 శవపేటికలను శాస్త్రవేత్తలు అదే ప్రాంతం నుంచి వెలికితీశారు. ఈ మమ్మీలను ఈజిప్టియన్ మ్యూజియానికి తరలించి, అక్కడ ప్రదర్శించనున్నారు.
Latest News